అధ్యాయము 13

వాలు కుర్చీలో తాపీగా కూర్చొనియున్న

పరమహంసను చూడగానే.....

విలియమ్ హార్వే వెంటనే..... ఆయన దగ్గరకి వెళ్ళి....

"గురూజీ! మీరు మరణమును జయించారా?" అనగానే.....

"మరణము అంటే ఏమిటి?" అనగానే....

"ఏముంది గురూజీ! శ్వాస ఆడకపోవడము, గుండె పని చెయ్యకపోవడము, మెదడు మొద్దుబారడము, శరీరము కదలకపోవడము" అన్నాడు.

"అయితే నువ్వు చెప్పిన మీ ఈ లక్షణాలు అన్నీగూడ  నా శరీరమునకు ఉన్నాయి గదా. అంటే నేను నీ దృష్టిలో మరణించిన వాడినే గదా" అనగానే....

హార్వే ఈ మాటలు విని గతుక్కుమన్నాడు.

 దానితో అనుమానము వచ్చి...

ఈయన శరీరమును ఆసాంతముగా పరిశీలన చేస్తూ ముక్కు దగ్గర చేతులు పెట్టి శ్వాస ఆడటము లేదని, పల్స్ బట్టి గుండె ఆడటము లేదని, శరీరము బిగుసుకొని పోవడము బట్టి చూస్తుంటే ఈయన చనిపోయాడని అర్థమైనా ఒక నిర్ధారణకు రావాలంటే డాక్టర్ జోషి చెపితేనే బాగుంటుందని....

ప్రక్క గదిలో ఏదో పుస్తకమును చదువుతున్న జోషిని పెద్దగా పిలిచి.... 

"మన గురూజీకి ఏదో అయ్యింది. శ్వాస ఆడటము లేదు" అని అరవగానే....

ఈ మాటలు విన్న దేవి గూడ కంగారు కంగారుగా ఈయన దగ్గరకి వచ్చింది.

         డాక్టర్ జోషి...... తన దగ్గరున్న స్టెతస్కోప్ తో గుండెను పరీక్షించి అలాగే ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ చూసినా గూడ ముక్కు దగ్గర శ్వాసను  చూసిన ఎలాంటి ఫలితము కనిపించలేదు. శరీరము బిగుసుకొని పోవడము గమనించి కొన్ని క్షణాల క్రితమే మన గురూజీ జీవ సమాధి చెంది ఉంటారని డాక్టర్ జోషి చెప్పగానే......

హార్వే కి, దేవికి గుండె ఆగినంత పని అయ్యింది. కళ్ల వెంట కన్నీళ్లు రావడము  మొదలైంది.


48 నిమిషాలు ఇలాంటి స్థితి నడుస్తుండగా.....

ఉన్నట్టుండి.... ఒక్కసారిగా.....

పరమహంస శరీరములో కదలిక రావడము మొదలు  అయ్యేసరికి....

మొదట వీళ్లకి భయమేసింది. దూరంగా జరిగారు.

"అరే! నేను దెయ్యాన్ని కాదురా! మనిషినే! నేను చావలేదు! చచ్చే వాడి లక్షణాలు మన హార్వే నాకు చెపుతూంటే ఆ లక్షణాలు నాలో వాడికి కొన్ని నిమిషాల పాటు చూపించాను. నేను చావలేదు! బ్రతికే ఉన్నాను!గావాలంటే నన్ను తాకి చూసుకోండి" అనగానే.....

హార్వే తేరుకొని....

గురూజీ! దగ్గరికి వెళ్లి మళ్లీ యధావిధిగా అన్ని పరీక్షలు చేసి అన్ని శరీరభాగాలు బాగానే పనిచేస్తున్నాయని తెలుసుకొని కొంత స్థిమిత పడి పడగానే మిగిలిన ఇద్దరు ఈయనని చేరుకొని తమ అనుమాన భయమును  తొలగించుకున్నారు.


డాక్టర్ జోషి వెంటనే....

"గురూజీ! ఇది ఎలా సాధ్యము. శ్వాస ఆపడము, గుండె పనిచేయ్యకపోవడము, శరీరము బిగుసుకొనిపోవడము" అనగానే......

నాయనా! 48 నిమిషాల పాటు ఇలాంటి స్థితిలో అది గూడ యోగనిద్ర సిద్ధి పొందిన సాధకుడికి మాత్రమే కలుగుతుంది.ఇలాంటి నిద్రావస్థలో సాధకుడు  తన శ్వాసను ఊపిరితిత్తుల ద్వారా గాకుండా గుండె ద్వారా శ్వాసక్రియ  నడుస్తుంది.

ఇలా ఈ విశ్వములో ఒక పాము మాత్రమే చేస్తుంది. అందుకే కుండలినీ శక్తికి ప్రతీకగా పామును ఉంచడము జరిగింది. ఇలా ఈ గుండె పనిచేస్తున్న సమయములో అది చేసే ప్రక్రియను త్రినేత్రమైన పీనియల్   గ్రంధి అనగా హృదయ గ్రంధి

చేసే పనిని ఈ గ్రంధి చేయ్యడము వలన గుండె శబ్దాలు నీకు వినిపించలేదు. సహజముగా పనిచేసే శరీరభాగాలు మా ఆత్మశక్తి తో అదే కుండలిని శక్తి జాగృతితో శరీర భాగాలు చేసే పనులు మార్చే శక్తి కలుగుతుంది. అంటే ముక్కుతో వాసన చూడాలి. కాని నాలుకతో వాసన చూడగలము! నోటితో వినగలము! చెవితో శ్వాసించగలము! చర్మముతో చూడగలము! కంటితో శబ్దాలు వినగలము! ఈ సిద్ధి పొందిన వాడికి తమ శరీర భాగాలతో ఎన్నో రకాల ఆటలు ఆడుకోవచ్చును. అవి నిత్యము చేసే ప్రక్రియలు మార్చుకోవచ్చును. యోగుల దగ్గర మానవుల ప్రక్రియలు పని చెయ్యవని ఈ పాటికి మీకు తెలిసే  ఉంటుంది అనగానే....

వెంటనే హార్వే.....

స్వామిజీ! అయితే మీరు మరణమును జయించినట్లే గదా అనగానే....

నాయనా! మరణమును జయించడము ఎవరి తరము గాదు. ఎందుకంటే మనకి పుట్టుకయేలేదు. ఇక మరణము ఎక్కడ నుండి వస్తుంది. పుట్టుక లేనివాడికి గిట్టుట ఉండదు గదా. కాని మరణమును సాగదీయవచ్చును.

అంటే మనుష్యుల ఆయిష్ 120 సంవత్సరాలు. ఆ తర్వాత ఇతడి భౌతికదేహము విచ్ఛిన్నమవుతుంది.అదే మీ దృష్టిలో మరణము అంటారు. అంటే భౌతిక శరీరము పనిచెయ్యకపోతే భౌతిక మరణము అవుతుంది. ఈ మరణమును తాత్కాలికముగా 120 సంవత్సరాల నుండి పది లక్షల సంవత్సరాలు దాకా కొనసాగించవచ్చును. అనగా 120 సంవత్సరాల తర్వాత వచ్చే శరీర ధర్మమైన మరణమును పది లక్షల సంవత్సరాల దాకా పొడగించవచ్చును అన్నమాట.

అంటే మరణమును వాయిదా వెయ్య వచ్చును కాని మరణమును జయించిన జీవి కాని దేవుడు కాని లేడు. మానవుడికి పుట్టిన దైవ అవతారాలు గూడ మరణము ముందు ఓటమి అంగీకరించక తప్పలేదు. శ్రీరాముడు 11 వేల సంవత్సరాలుంటే శ్రీకృష్ణుడు124 సంవత్సరాలు ఉండి మరణము  పొందడము జరిగింది. బుద్ధుడు, శిరిడి సాయిబాబా లాంటి వారు 84 సంవత్సరాల పాటు బ్రతికి మహా నిర్వాణ నిర్యాణము చెందక తప్పలేదు!

మరి స్వామి! సంజీవిని మంత్రముతో చనిపోయిన వారు ఎలా బ్రతికారు అనగానే....

నాయనా! భౌతిక శరీరము పని చెయ్యడము లేదంటే దీని లోపుల ఉన్న

మిగిలిన ఆరు శరీరాలలో ఏదో ఒక శరీరము దెబ్బ తినడము వలన భౌతిక  శరీరము పని చెయ్యదు. ఈ ఆరు శరీరాలకి మూల శరీరము వాయుశరీరము.దీనికి వాయు ప్రసరణ ఆగిపోతే మిగిలిన అన్ని శరీరాలు పని చెయ్యవు. నిధిలమవుతాయి. ఈ వాయు శరీరమునకు వాయువు నిచ్చే గుణము మన సంజీవి వేరుకి మాత్రమే ఉంది. రామాయణములో వాయుశరీరానికి వాయు ప్రసరణ ఆగిపోవడము...లక్ష్మణుడు భౌతిక శరీరము స్పృహ తప్పడము....దానితో సంజీవిని పర్వతమే తీసుకొని రావడము... ఈ వేరు వైద్యము చేసిన తర్వాత లక్ష్మణుడు కోలుకోవడము జరిగింది. మన పూర్వీక మహర్షులు వారి అనుభవాలను, వారు తెలుసుకున్న సత్య జ్ఞానాంశాలను మనదాకా రావాలని ఇలా కధాంశాల రూపములో, ఇతిహాసాల రూపములో చెప్పడము జరిగింది.మనమే అసలు విషయాలు ప్రక్కన పెట్టి కొసరు విషయాలు పట్టుకొని వ్రేలాడుతున్నాము. పైగా వీటిని వ్యాకరణాలు గూడ రాని మిడి మిడి జ్ఞానులు అనువదించి అర్ధాలే మార్చివేసినారు. యోగ శాస్త్రములో గోమాంస భక్షణ అనే ప్రక్రియకి పేరు ఉంటే దానికి గోమాంసము తినాలి అని అనువాదము చేశారు. నిజానికి అది ఒక యోగ ప్రక్రియ పేరు మాత్రమే. ఇలా తప్పుగా అనువాదము చేశారని నాకు తెలియడానికి 12 సంవత్సరాల పైన పట్టింది. ఇలా ఎన్నో తప్పుడు అనువాదాలు రాజ్యమేలుతున్నాయి. తప్పులు సరిచేసి వారిని తప్పు పట్టడముతో తెలిసినవారు గూడ మౌనము వహించక తప్పడము లేదు.విశ్వవ్రాత ఎవరు తప్పించగలరు.ఎవరు తప్పించుకోగలరు.

     అంతెందుకు ఆ చెట్టు మీద ఉన్న పావురమునకు పది నిమిషాలలో ఒక గ్రద్ధ వలన దానికి మరణము రాబోతోంది. అది చంపటానికి వస్తోందని దీనికి తెలుసు. వయస్సు పై బడటము వలన రెక్కలకి ఎగిరే శక్తి సన్నగిల్లడము వలన మరణము కోసము ఎదురుచూస్తూ మరణభయముతో ఆ పావురము బాధపడుతోంది. దానిని రక్షించగలరేమోనని ప్రయత్నించండి అనగానే.....


ఈ ముగ్గురు ఈ మాటలు విన్న వెంటనే అమితమైన బాధ వేసి..... ఆ పావురమున్న చోటుకి వెళ్లి దానిని పట్టుకొని ఒక ఇనుపచివ్వలతో చేసిన గూడులో ఉంచి తమ కళ్ళముందే ఉంచుకున్నారు. పరమహంస ఇదంతా చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయారు.

            గాలిలో వీళ్లకి గ్రద్ద తిరగడము గమనించి వీళ్లు మరింత జాగ్రత్తగా ఈ పావురమును కాపాడడం మొదలుపెట్టారు. దీనిని ఎక్కడ దాచాలో...... ఎలా దాచాలో తికమకపడసాగారు. అప్పుడప్పుడు అతి జాగ్రత్త, అతి ప్రేమ, అతి భయము గూడ  ప్రమాదాలు కొని తెస్తాయని వీళ్లకి తెలియదు.

ఇలా గాదనుకొని.....

ఈ పావురమున్న పంజరమును తమ మధ్యలో నేల మీద పెట్టుకొని ఈ ముగ్గురు కాపలా కాయసాగారు. పావురములో ఏగశ్వాస మొదలైంది. గ్రద్ద దీని సమీపానికి రావాలని విశ్వప్రయత్నాలు మొదలుపెట్టింది. దానితో ఈ ముగ్గురు ఈ  గ్రద్దను కాపాడే ప్రయత్నములో ఉండగా......

అనుకుని విపత్తుగా.....

ఈ పావుర పంజరము మీద ఇంటి కప్పు పై నుండి పగిలిన బంగ్లా పెంకు ఒకటి వచ్చి సరిగ్గా ఈ పంజరము మీద పడటము

వెనువెంటనే......

క్షణాలలో పావురము దెబ్బ తగిలి రక్తము కక్కి చనిపోవడము చూసేసరికి వీళ్లకి మతి పోయింది.

హార్వేకి కోపము వచ్చి.....

ఇదంతా అక్కడే ఉండి చోద్యములాగా చూస్తున్న పరమహంసతో....

స్వామీజీ! మీరేమో గ్రద్ధతో దేవికి ప్రాణగండమున్నదని చెప్పారు. కాని ఇది పెంకుకి ఎలా చనిపోయింది. మీరు మాకు తప్పు చెప్పారా?

లేదు నాయనా! నేను నిజమే చెప్పాను. ఆ సమయములో పావురము ఆ చెట్టు మీద ఉన్నప్పుడు దానికి యముడు ఈ గ్రద్ధయే అయ్యేది. కాని మీరు ఎప్పుడైతే దాని స్థలమును మార్చినారో ఆ యముడు గూడ తన రూపమును మార్చుకొని ఈ పెంకు రూపములో వచ్చి దాని ప్రాణాలు తీశాడు. ప్రాణము రాకడ అలాగే దాని పోకడ ఎవరికీ అంతుపట్టదు. తెలియను గూడ తెలియదు.

               ఇలా ఎన్నింటినో రక్షించాలని ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసి వాటి మరణాల విషయములో నాకు  అపజయము తప్పలేదు. పిల్లి పిల్లల్ని మగ పిల్లుల నుండి రక్షించలేకపోయాను. పిల్లుల నుండి పావురాలను రక్షించలేకపోయాను.

కుక్కల నుండి పిల్లుల్ని రక్షించలేకపోయాను. కుందేలు, కోతులు, ఆవు దూడలు, గేదెలు, మొక్కలు ఇలా ఎన్నో రకాల జీవులు నా చేతులలో నా కళ్ల ముందు చచ్చిపోతుంటే  వాటిని రక్షించలేని నా అసమర్థత మీద నాకే అసహ్యమేసింది.

మెదడు మొద్దు బారి పోయింది. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవాడిని.

     అప్పుడు అనుకోకుండా మా ఇంటికి సంచారము చేసే ఆధ్యాత్మికవేత్త ఒకరు వచ్చి నాకు ఒక కథను బోధ చేశాడు. అది ఏమిటంటే కైలాసనాధుడి సమక్షములో ఒక పావుర ముండేది. ఒకసారి యముడు కాస్త మహాశివుడి దర్శనార్థమై వచ్చి ద్వారము దగ్గర ఉన్న పావురమును చూసి......

అయ్యో! ఇది నా చేతిలో రాబోవు ఏడు క్షణాలలో చనిపోవాలి గదా. పైగా అది గూడ ఇక్కడికి 300 కోసల దూరములో ఉన్న జంబూద్వీపములో దీని మరణ వ్రాత ఉంది. మరి ఇదేమో కైలాసములో ఉంది. మరి ఏడు గంటలు పట్టే జంబూద్వీపానికి

ఏడు క్షణాలలో ఎలా చేరుకుంటుందో...... విధాత విధి వ్రాత ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటూ..... లోపలకి వెళ్లాడు. ఈ పావురము కాస్త యముడి రాక గమనించి... తన వైపు అదోలా చూసిన యముడి చూపును గ్రహించి తన దైవమైన

గరుత్మంతుడిని ప్రార్థించగానే..... ఆయన ప్రత్యక్షమై..... అసలు విషయము తెలుసుకొని....

 అయితే యముడి చూపు పడని జంబూద్వీపానికి నిన్ను క్షణాలలో తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆ పావురమును అక్కడికి చేర్చాడు. అనుకున్న సమయానికి అనుకున్న

చోటులో ఆ పావురము ప్రాణాలు విడవడము యముడు చూశాడు. కాబట్టి ఎవరు గూడ మరణమును జయించలేరని.... మరణమును వాయిదా  వేసుకుంటారని..... చివరికి సప్త చిరంజీవులు అయిన హనుమ, దత్తాత్రేయుడు, సంజయుడు, బలి చక్రవర్తి, అశ్వద్ధామ ...ఇలా వీరందరు గూడ కల్పాంతములో మరణాలు పొందక తప్పదని.....

అంతెందుకు బ్రహ్మ గూడ బ్రహ్మ కల్పానికి అంతరించక తప్పదని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. దానితో నా మనస్సు కుదుట పడి విధి వ్రాతను ఎవరు తప్పించుకోలేరని నాకు అర్థమై మరణాల విషయాలలో మౌనము వహించక తప్పలేదు.

దేవి వెంటనే.....

గురూజీ! మీకున్న యోగశక్తితో ఈ పావురమును బ్రతికించలేరా ?

అమ్మాయి! బ్రతికించగలను! అప్పుడు అది నాలుగు రోజులు మాత్రమే బ్రతికి పునః జన్మ కోసము కుక్క కడుపున కుక్కపిల్లగా పుడుతుంది. విధి వ్రాత అలా ఉంది. ఈ కుక్క పిల్లయే రాబోవుకాలము మనకి కాలభైరవుడిగా రక్షణ ఇస్తుంది.

గాకపోతే రూపము మారుతుంది. అది చేసే పని మారుతుంది అంతే తేడా. ఈ విశ్వములో ప్రతీదిగూడ మన కంటికి కనిపించని వేగముతో క్షణానికి ఒక రూపము మారుతోందని పూర్వీకులు తెలుసుకున్నారు. మనము తెలుసుకొనే ప్రయత్నములో ఉన్నాము అంటూ....

ఈ పావురము యొక్క వాయు శరీరమును వాయువును అందించే ప్రయత్నము

పరమహంస యుండగా.....

మిగిలిన వాళ్లు జరగబోయే వింతను కళ్లారా చూడాలని ఆత్రముగా చచ్చిన పావురము కేసి ఆశ్చర్యముగా చూడసాగారు.


No comments:

Post a Comment